బెల్లంపల్లి: రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీ జనాభా ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్లో తగినంత నిధుల కేటాయింపు జరగలేదని జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ విమర్శించారు. శనివారం బెల్లంపల్లి ఏఎంసీ ఏరియా బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు అత్తెసరు నిధులు కేటాయించడం సరికాదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.12,500 కోట్లు కేటాయించి మోసం చేసిందన్నారు. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గణేష్గౌడ్, కౌన్సిలర్ దొంగల రాజ్కుమార్, నాయకులు బండారి ప్రవీణ్కుమార్, పాయవేణ మల్లేశ్, మధు తదితరులు పాల్గొన్నారు.
నిరాశ మిగిల్చిన బడ్జెట్
జన్నారం: రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గల్ఫ్ కార్మికులకు నిరాశ మిగిల్చిందని తె లంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమన్న ఆరోపించారు. మండలకేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం నిధి, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తాజా బడ్జెట్లో గల్ఫ్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో మండల అధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి దుమల్ల ఎల్లయ్య (రెడ్డి), ఉపాధ్యక్షులు ప్రశాంత్, జన్నారం టౌన్ అధ్యక్షుడు రాజేష్, కోశాధికారి అంజయ్య పాల్గొన్నారు.


