మందమర్రిరూరల్/కాసిపేట: సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరగడం వల్ల సంస్థకు నష్టంతోపాటు కార్మికుల హక్కులు హరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మండిపడ్డారు. సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవ్ సింగరేణి బస్సు జాత శుక్రవారం మందమర్రి పట్టణంలోని కాసిపేట–1, 2 గనులపై సాగింది. మందమర్రి మార్కెట్ ఏరియాలో నిర్వహించిన బహిరంగ సభలో, గనులపై నాయకులు మాట్లాడారు. సింగరేణికి రావాల్సిన రూ.51 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. రాజకీయ జోక్యం తగ్గకపోతే మరో ఐదారేళ్లలో సంస్థ మనుగడ కష్టతరమని, ఉద్యోగులకు వేతనాలు చెల్లించే పరిస్థితి కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బస్సు జాత ఈ నెల 30 కొత్తగూడెంలో ముగుస్తుందని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, ఏఐటీయూసీ డెప్యూటీ జనరల్ సెక్రెటరీలు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు సత్యనారాయణ, దాగం మల్లేష్, చిప్ప నర్సయ్య, నాయకులు సుదర్శన్, శ్రీనివాస్, మినుగు లక్ష్మీనారాయణ, నాయకులు పాల్గొన్నారు.


