మంచిర్యాలఅగ్రికల్చర్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో తహసీల్దార్లు, ఉప తహసీల్లార్ల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనర్హులు, డూప్లికేట్ నమోదు, మృతులు, చిరునామా మారిన వారి వివరాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్ల సహకారంతో ఇంటింటి సర్వే సమర్థవంతంగా నిర్వహించాలని, అవసరమైన చోట ఆన్లైన్ నమోదు ప్రక్రియ వినియోగించుకోవాలని సూచించారు.
ఉద్యోగులు సమయపాలన పాటించాలి
బెల్లంపల్లి/భీమిని: ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కన్నెపల్లి మండల కేంద్రంలోని పలు కార్యాలయాలను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయంలో గైర్హాజరైన టైపిస్ట్కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. బెల్లంపల్లిలోని కేజీబీవీని మున్సిపల్ కమిషనర్ సంపత్తో కలిసి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అదనపు తరగతి గదులు, భోజన శాల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థుల కోసం ఈసారి సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ బజారు ఏరియా ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. రామ్నగర్ బస్తీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు.


