
సర్కారు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ
మంచిర్యాలఅర్బన్/నిర్మల్ఖిల్లా: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య అందుబాటులోకి రానుంది. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 12 జిల్లాలు ఎంపిక చేశారు. అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలలో పూర్వ ప్రాథమిక విద్య అమలుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు కొనసాగుతుండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి విద్యార్థులు చదువుకునే వీలుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సర్కారు పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో కూడా ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా 210 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో 14, కుమురంభీం ఆసిఫాబాద్లో 7, నిర్మల్ జిల్లాలో 2 పాఠశాలల్లో పూర్వ విద్య అందుబాటులోకి రానుంది.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో ఎంపీపీఎస్, గుడిరేవు, ఎంపీపీఎస్, రెబ్బనపల్లి, ఎంపీపీఎస్, గంపలపల్లి, ఎంపీపీఎస్ క్లబ్రోడ్–లక్సెట్టిపేట్, ఎంపీపీఎస్, ముల్కలగూడ, లక్సెట్టిపేట్, ఎంపీపీఎస్ బోయవాడ, లక్సెట్టిపేట్, ఎంపీపీఎస్, నాయకపుగూడ (ఎస్), ఎంపీపీఎస్ రోట్టపల్లి, ఎంపీయూపీఎస్ పెద్దనపల్లి, ఎంపీపీఎస్ గెర్రిగూడెం (కొత్తకాలనీ), ఎంపీపీఎస్ మామడ, ఎంపీపీఎస్ మిట్పల్లె, మందమర్రి (వీ), ఎంపీపీఎస్ సుపాక (కే).
కుమురంభీం జిల్లాలో..
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపీపీఎస్ ధనోరా (యూఎం), ఎంపీపీఎస్ గుండాయిపేట్, ఎంపీపీఎస్ ముత్తంపేట్, ఎంపీపీఎస్ డబ్బా, ఎంపీయూపీఎస్, రుద్రపూర్, ఎంపీపీఎస్ కొండపల్లి, ఎంపీపీఎస్ చడ్వాయి.
నిర్మల్ జిల్లాలో...
నిర్మల్ జిల్లాలో ఎంపీపీఎస్ చామన్పల్లి, ఎంపీపీఎస్ పేండ్పల్లిలో పూర్వ ప్రాథమిక విద్య అమలుకానుంది.
ఉమ్మడి జిల్లాలో 23 పాఠశాలల్లో పూర్వప్రాథమిక తరగతులు
తొలిదశలో ఉమ్మడి ఆదిలాబాద్లో మూడు జిల్లాల్లో అమలు
పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ
ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు...
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని పెండ్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2017 నుంచే ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తూ ప్రవేశాల సంఖ్య క్రమంగా పెంచుతూ వస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి తరగతుల నిర్వహణ వల్ల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపకుండా తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణతో ప్రవేశాల సంఖ్య పెంచామని ప్రధానోపాధ్యాయులు ఎం.అమృతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 130 వరకు విద్యార్థులున్నారని, ఈ సంవత్సరం సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ బడులను బలోపేతం చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.
ప్రాథమిక పాఠశాలలు పరిపుష్టం
ప్రీ ప్రైమరీ తరగతులను అనుసంధానం చేయడం వల్ల ప్రైమరీ స్కూల్స్ బలోపేతం అవుతాయి. మూడేళ్ల వయసు ఉన్నప్పుడే ప్రైవేటు బడుల్లోకి పంపుతున్న తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ప్రైమరీ తరగతికి ప్రత్యేక సిలబస్ ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.
– తోట నరేంద్రబాబు, పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్
చిన్నారులకు ప్రయోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటుతో చిన్నారులకు ఎంతగానో ప్రయోజనం కలగనుంది. ఇదివరకు ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపించడం వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉన్న ఊళ్లోనే ిపిల్లలను చేర్పించవచ్చు. ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అవుతాయి. పిల్లలకు విద్యాభాస్యం ప్రారంభించేందుకు ఒక మంచి పునాది వేస్తుంది.
– ఎస్.యాదయ్య, డీఈవో, మంచిర్యాల

సర్కారు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ

సర్కారు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ

సర్కారు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ