
పచ్చిరొట్టతో ప్రయోజనం
● రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి ● పంటల దిగుబడి పెంచుకోవాలి
చెన్నూర్రూరల్: అన్నదాతలు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని ఏడీఏ బానోతు ప్రసాద్ సూచిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో భూమిలో కాలుష్యం పేరుకు పోయి పంటలకు కొత్త తెగులు సోకుతాయన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, 30 కిలోల బ్యాగుకు పూర్తి ధర రూ.4,276 ఉండగా రైతుకు సబ్సిడీపై రూ.2,137కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రైతులు పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, పిల్లి పెసర, జీలుగ, అలసంద, పెసర తదితర విత్తనాలను ఎంపిక చేసుకుంటే ఖర్చు తక్కువతో పాటు ఎక్కువ దిగుబడి సాధించవచ్చని సూచిస్తున్నారు.
పచ్చిరొట్టతో లాభాలు
పచ్చిరొట్ట సాగుతో భూమిలో 16 రకాల సూక్ష్మ పోషకాలు వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. పచ్చిరొట్ట ఎరువులు వాడితే చౌడుభూములు సారవంత మవుతాయి. మొక్కలకు బాగా ఆక్సిజన్ అందుతుంది. జింకులోపం నివారించడంతో పాటు నత్రజని శాతం పెరుగుతుంది. మేలైన దిగుబడులు సాధించవచ్చు.
సాగు చేసే విధానం
వరి నారు పోయడానికి వారం రోజుల ముందు పచ్చిరొట్ట విత్తనాలను పొలంలో చల్లాలి. నెల లేదా 45 రోజుల తర్వాత పచ్చిరొట్ట పైరును భూమిలో కలియ దున్నితే మురిగిపోయి ఎరువుగా మారి పంట ఎదుగుదలకు ఉపకరిస్తుంది. మెట్ట పొలాల్లో పెసర, పిల్లి పెసర, అలసంద విత్తనాలు చల్లి 45 రోజుల తర్వాత వాటి ఆకుకోసి భూమిపై పరిచి దుక్కి దున్నాలి. అలా చేస్తే అది కుళ్లి భూమిలో కలిసి పోతుంది. ఇలా చేసిన తర్వాత పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.