
ఆన్లైన్ గేమింగ్ రాకెట్ గుట్టురట్టు
● ఐదుగురిపై కేసు నమోదు.. నలుగురి అరెస్ట్ ● ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్: ఆన్లైన్ గేమింగ్ రాకెట్ గుట్టురట్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని వన్టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ పట్టణంలోని పంచవటి హోటల్లో కొంత మంది వ్యక్తులు ఆన్లైన్ గేమింగ్ ఆడి అమాయకులను మోసం చేస్తున్నారనే సమాచారం వచ్చిందన్నారు. గదిలో పోలీసులు తనిఖీ చేయగా ఐదుగురు వ్యక్తులు ఉన్నారని, పోలీసులను చూసి ఓ వ్యక్తి పారిపోయాడన్నారు. వారిలో నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన గొంటి రమేశ్, మహారాష్ట్రలోని ఆకోలకు చెందిన ప్రకాష్ బద్దు రాథోడ్, జిల్లా కేంద్రంలోని మీడియా కాలనీకి చెందిన జాదవ్ ప్రహ్లాద్, మహారాష్ట్రలోని థానేకు చెందిన పంకజ్ నాందేవ్, భోరజ్ మండలంలోని నిరాలకు చెందిన బోంద్రే సూర్యబాన్ ఉన్నారన్నారు. ఏ–1 గొంటి రమేశ్ ఈనెల 10న ఏ–2 ప్రకాష్ బద్దు రాథోడ్కు ఫోన్చేసి పంచవటి హోటల్లో గదిని బుక్ చేయాలని చెప్పాడు. పంకజ్ నాందేవ్తో కలిసి వస్తానని పేర్కొన్నాడు. బోంద్రే సూర్యభాన్ హోటల్లోని గదిలో వేచి ఉండగా వారికి ఆన్లైన్ గేమింగ్ గురించి గొంటి రమేశ్ వివరించాడు. ప్రతీఒక్కరు రూ.9,100 చొప్పున ఆన్లైన్ ద్వారా వేసి సాయంత్రం 4 గంటలకు గేమ్ ఆడటం ప్రారంభించారు. గేమ్లో గెలిస్తే 100 అమెరికన్ డాలర్లు లాభంగా వస్తాయని చెప్పాడు. వీరు గేమ్ ఆడుతుండగా పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకోగా రమేశ్ పరారయ్యాడు. ఐదుగురిపై కేసు నమోదు చేసి నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఐదు సెల్ఫోన్లు, ఒక కారు, మూడు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.