
మంత్రాల నెపంతో ఒకరి దారుణ హత్య
● నిర్మల్ జిల్లా నగర్లో ఘటన
లోకేశ్వరం: తమ కుటుంబ సభ్యులకు మంత్రాలు చేస్తున్నాడని ఒకరిని దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని నగర్లో చోటు చేసుకుంది. ముధోల్ సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు నగర్ గ్రామానికి చెందిన గడ్డం పోసులు (64) గురువారం ఉదయం తన వ్యవసాయ పనుల నిమిత్తం నడుచుకుంటూ వెళ్తుండగా బస్టాండ్ ప్రాంతంలో కాచుకుని కూర్చున్న అదే గ్రామానికి చెందిన గడ్డం గంగాధర్, గడ్డం సాయిలు ఒక్కసారిగా పోసులుపై ఇటుకలు, బండాయితో ముఖంపై దాడిచేసి హత్య చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏడాది క్రితం గంగాధర్ 17 నెలల కూతురు, రెండు నెలల క్రితం రెండు ఆవులు మృతి చెందాయి. అంతేకాకుండా తన తల్లికూడా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, వీటన్నింటికి పోసులు చేతబడే కారణమని హత్యకు పాల్పడినట్లు సీఐ పేర్కొన్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు గడ్డం సాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని ఏఎస్పీ అవినాష్ కుమార్ పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.