
పిల్లల సంక్షేమానికి అంగన్వాడీ బాట
భీమారం: పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని బూర్గుపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఎగ్ బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, పిల్లలతో కలిసి భోజనం చేశారు. జిల్లా మహిళ, శిశు సంక్షేమ అధికారి రౌఫ్ఖాన్, మండల ప్రత్యేక అధికారి కల్పన, తహసీల్దార్ సదానందం, సీడీపీవో మనోరమ పాల్గొన్నారు. ఆ తర్వాత మండల కేంద్రంలో పీహెచ్సీ నూతన భవన నిర్మాణ పనులు, కేజీబీవీ, వసతిగృహాం పరిశీలించారు.
ఔషధ మొక్కలతో రోగాలు నయం
జన్నారం: అడవుల్లో సహజంగా పెరిగే మొక్కల్లో అనేక ఔషధాలు ఉన్నాయని, వాటితో అనేక రకాల రోగాలు నయమవుతాయని ఇందన్పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఇందన్పల్లి రేంజ్ పరిధిలోని నార్లపూర్ బీట్లో సిబ్బందితో కలిసి పర్యటించారు. కలుపు మొక్కలు, ఔషధ మొక్కలను గుర్తించారు. ఔషధ మొక్కల ఉపయోగాలను సిబ్బందికి తెలిపారు. ప్రతీ రోజు బీట్ అధికారులు బీట్ పరిధిలో పర్యటించి గడ్డి మైదానాలు ఏర్పాటు చేసుకోవాలని, వన్యప్రాణులు గడ్డిని ఇష్టంగా తింటాయని సూచించారు. సెక్షన్ అధికారులు హన్మంతరావు, రవి, బీట్ అధికారులు పాల్గొన్నారు.