
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
జన్నారం: మండలంలోని పొనకల్, ధర్మారం గ్రామాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై గొల్లపెల్లి అనూష తెలిపారు. ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా ఇసుక ట్రాక్టర్లు కనిపించడంతో పట్టుకుని సీజ్ చేసి సదరు ట్రాక్టర్ యాజమానులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
రేపు అండర్–19
క్రికెట్ జట్టు ఎంపిక
మంచిర్యాలక్రైం: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఈనెల 13న జిల్లాస్థాయి అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు క్రికెట్ కోచ్, జిల్లా కార్యదర్శి ప్రదీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక విధానం రౌండ్ రాబిన్ మ్యాచ్ల రూపంలో ఉంటుందని, ఈ మ్యాచ్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 2006 సెప్టెంబర్ 1 తరువాత జన్మించి ఉన్నావారు మాత్రమే అర్హులన్నారు. అర్హత, ఆసక్తి కలవారు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం వెంట తీసుకుని ఉదయం 8 గంటలకు హాజరు కావాలన్నారు.
చెట్టుకొమ్మలు విరిగిపడి బైకులు ధ్వంసం
నస్పూర్: సీసీసీ కార్నర్ సమీపంలోని ఓ మద్యం దుకాణం ఎదుట ఉన్న వేపచెట్టు కొమ్మలు బుధవారం గాలికి విరిగి పడడంతో చెట్టు కింద ఉన్న సుమారు 10 బైక్లు ధ్వంసమయ్యాయి. దీంతో పాటు కొమ్మలు విద్యుత్ వైర్ల మీద పడడంతో స్తంభం కిందకు వంగింది. దీంతో తీగలు సైతం కిందకి వేలాడి ప్రమాద కరంగ మారడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో మద్యం దుకాణం ముందున్న ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్జీవో హౌసింగ్
సొసైటీపై విచారణ
మంచిర్యాలఅగ్రికల్చర్: మంచిర్యాల నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీవోస్) హౌసింగ్ సొసైటీలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ సురేంద్రమోహన్ బుధవారం విచారణకు ఉత్వర్వులు జారీ చేశారు. విచారణ అధికారిగా జిల్లా సహకారశాఖ సూపరింటెండెంట్ జి.హనుమంత్రెడ్డిని నియమించారు. ప్లాట్ల కేటాయింపు, అర్హులు కాకుండా అనర్హులు ఉన్నారని, స్థలాల మధ్య వ్యత్యాసం, తదితర అక్రమాల ఆరోపణలపై 1995లో సెక్షన్ 29 ప్రకారం అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి అందజేసిన నివేదిక ఆధారంగా విచారణ చేపట్టనున్నారు.

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్