
మత్స్యసొసైటీ ఖాతాలో నగదు జమచేయాలి
పాతమంచిర్యాల: మత్స్య సొసైటీలకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు సరఫరా చేసేందుకు బదులుగా సొసైటీల ఖాతాలలో నగదు జమచేస్తే సభ్యులకు లాభదాయకంగా ఉంటుందని తెలంగాణ మ త్స్యకారుల, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లల బాలకృష్ణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని చార్వక ట్రస్ట్ భవన్లో మత్స్య కార్మిక సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీసీ, ఎన్ఎఫ్డీ స్కీంలను పునరుద్ధరించాలని, మత్స్యకారులకు టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలు 90 శాతం సబ్సిడీపై మంజూరు చేయాలన్నారు. మత్స్యకారులు ప్రమాదాల బారిన పడి చనిపోతే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సహజ మరణానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో పది ఎకరాల్లో అధునాతన చేపల మార్కెట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోడెంకి చందు, నాయకులు గుమ్ముల శ్రీనివాస్, పెద్దపల్లి మధునయ్య, పందిరి రమాదేవి, లెల్లల మల్లీశ్వరి, బానెం నాగన్న, నాగుల మహేందర్, తదితరులు పాల్గొన్నారు.