
మూడో యూనిట్కు ముహూర్తమెప్పుడో!
● ఎస్టీపీపీలో 2015లో శంకుస్థాపన ● పనులు దక్కించుకున్న బీహెచ్ఈఎల్ ● పదేళ్లయినా ప్రారంభంకాని పనులు ● ఉపాధి కోసం నిరుద్యోగుల నిరీక్షణ
జైపూర్: పదేళ్లయినా మండల కేంద్రంలోని ఎస్టీపీపీలో మూడో యూనిట్ ప్లాంట్ నిర్మాణం టెండర్ల దశలోనే నిలిచింది. 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ను విస్తరిస్తూ రెండు యూనిట్లకు అదనంగా మూడో యూనిట్ ఏర్పాటుకు 2015 మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న 600 మెగా థర్మల్ పవర్ ప్లాంట్ల ఎదుట మరో 600 మెగావాట్ల ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణలో భాగంగా సూపర్క్రిటికల్ విధానంతో 800 మెగావాట్ల ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నూతనంగా నిర్మించనున్న 800 మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కు అన్ని అనుమతులు పొందడానికి ఎనిమిదేళ్లు పట్టగా టెండర్లు ఖరారు కావడానికి మొత్తం 10 ఏళ్లు పట్టింది. రెండు దఫా లుగా సింగరేణి నిర్వహించిన టెండర్లలో రెండోసా రి బీహెచ్ఈఎల్ కంపెనీ దక్కించుకోగా సుమారు రూ.8,500కోట్ల అంచనా వ్యయంతో కొత్త ప్లాంట్ నిర్మించనున్నారు. టెండర్ల దశకు చేరుకోవడానికి పదేళ్లు పట్టగా పనుల ప్రారంభోత్సవానికి ముహూర్తం కాలిసి రావడం లేదు. ఓసారి ఉపముఖ్యమంత్రి ప్రోగ్రాం ఖరారై చివరి నిమిషంలో నేతల మధ్య వర్గపోరుతో రద్దయింది. ఉపముఖ్యమంత్రి పవర్ ప్లాంట్ సందర్శన, పలు ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉండగా వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. మళ్లీ సీఎం చేతుల మీదుగా కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవం ఉంటుందని అందరూ భావించారు. గత నెలలో అధికార యంత్రాంగం సీఎం ప్రోగ్రాం ఉంటుందని హడావుడి చేసినా అది కూడా ఖరారు కాలేదు. అసలు కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవానికి సమయమే కలిసిరావడం లేదని అభిప్రాయపడుతున్నారు. కాగా, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఇటీవల మంత్రి వర్గంలో చోటు దక్కింది. మంత్రి హోదాలో అతడు సీఎం రేవంత్రెడ్డి చే తుల మీదుగా ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తారని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఆరు నెలలుగా కసరత్తు జరుగుతున్నా..
జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కాంతులు పంచుతోంది. సింగరేణి సంస్థకు ఇక్కడి వనరులు అనుకూలించడం ప్రధానంగా అంచనాకు మించి సేకరించిన భూములతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను విస్తరించే దిశగా ఆదిలోనే అడుగులు వేసింది. అందులో భాగంగానే నూతనంగా మరో 800 మెగావాట్ల ప్లాంట్ను రూ.8,500కోట్ల అంచనాతో నిర్మించాల ని నిర్ణయించింది. కానీ, నిధుల సమీకరణలో జా ప్యం చోటు చేసుకుందో?.. లేదా ఆశించిన స్థాయిలో సింగరేణి సంస్థకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించిందో.. లేదో కానీ 800 మెగావాట్ల ప్లాంట్ పనులు 10 ఏళ్లుగా టెండర్ల దశలోనే నిలిచాయి. ఎట్టకేలకు మళ్లీ బీహెచ్ఈఎల్ కంపెనీ పనులు దక్కించుకోగా పనుల ప్రారంభోత్సవానికి ఆరు నెలలుగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పవర్ప్లాంట్లో కొత్త ప్లాంట్ నిర్మించే ప్రాంతాన్ని చదును చేసి అధికార యంత్రాంగం ఎదురుచూస్తోంది. రాజకీయ నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అధికారిక కార్యక్రమాలూ రద్దుకావడం అంతటా చర్చనీయాంశమైంది.
కొత్త ప్లాంట్ నిర్మించనున్న ప్రాంతం
ఉపాధి కోసం యువత నిరీక్షణ
ఎస్టీపీపీలో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ పూర్తయితే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని స్థానిక నిరుద్యోగ యువకులు, భూనిర్వాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా కొత్త ప్లాంట్ ప్రారంభమవుతుందని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ దాని పనులు ప్రారంభం కాకపోవడంతో వారికి నిరాశే మిగులుతోంది. కొత్త ప్లాంట్ ని ర్మాణంతో ప్రభావిత గ్రామాలతో పాటు పరిసరప్రాంతాల్లో ఇక నిరుద్యోగ సమస్య పూర్తిగా తీరుతుందని అందరూ భావిస్తున్నారు. అయి నప్పటికీ ప్లాంట్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుండడం గమనార్హం.