
ఆటో బోల్తాపడి ఒకరి మృతి
● ఐదుగురికి గాయాలు
ముధోల్: మండలంలోని బోరిగాం, వడ్తాల గ్రామాల మధ్య ఆటో బోల్తా పడ్డ ఘటనలో బ్రహ్మణ్గావ్కు చెందిన రొడ్డ ముత్యం (50) మృతి చెందగా, ఐదుగురికి గాయాలైనట్లు ఎస్సై పెర్సీస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాసర మండలం కిర్గుల్(కే) గ్రామానికి చెందిన ఆటోలో మంగళవారం లోకేశ్వరం మండలం అబ్ధుల్లాపూర్ గ్రామానికి తమ బంధువు అంత్యక్రియలకు ముత్యం వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడడంతో గాయాల పాలైనవారిని భైంసా ఏరియాస్పత్రికి తరలిస్తుండగా తీవ్రంగా గాయపడ్డ ముత్యం మార్గ మధ్యలో మృతి చెందాడు. గాయపడ్డ వారిలో బాసర మండలం కిర్గుల్(కే) గ్రామానికి చెందిన బుజ్జవ్వ, కాశీ, ముధోల్ మండలంలో బ్రహ్మణ్గావ్ గ్రామానికి చెందిన లక్ష్మి, గంగన్న, రువ్వి గ్రామానికి చెందిన శ్యామల ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.