
ప్రయాణికులపై ఆర్టీసీ బాదుడు
● పెరిగిన బస్సుపాస్ చార్జీలు
● మంచిర్యాల–హైదరాబాద్కు టోల్ వాత
● కిలోమీటర్ల రౌండప్ చార్జీలతో అదనపు భారం
బస్పాస్ చార్జీలు తగ్గించాలి
ఆర్టీసీ బస్సుపాస్ చార్జీలు తగ్గించాలి. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. చార్జీల పెంపుతో గ్రామీణ విద్యార్థులపై పె నుభారం పడుతుంది. మూడు నెలల ప్యాకేజీని రూ.1200 నుంచి రూ.1800 వరకు పెంచారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటు చెల్లించకుండా బస్చా ర్జీలు పెంచడం సరికాదు. పెంచిన 20శాతం బస్సుచార్జీలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లని మంగళవారం ఆర్టీసీ డిపో కార్యాలయంలో వినతిపత్రం అందజేశాం.
– బి.అభిరాం, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపింది. టోల్ప్లాజా దారుల్లో యూజర్ చార్జీలను ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.10 వసూలు చేస్తోంది. డిజీల్, ఇతరత్రా పెరిగిన ఖర్చుల సాకుతో అన్ని రకాల బస్పాస్ల ధరలూ పెంచింది. పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటరు రౌండప్, టోల్ యూజర్, బస్పాస్ చార్జీ(రౌండెడ్ అప్)ల పేరిట ప్రయాణికులపై భారం మోపడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. యూజర్ చార్జీలు రూ.10, బస్పాస్ ధరలు రూ.300కు పైగా పెంచడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 146 బస్సులు ప్రతీ రోజు 62వేల కిలోమీటర్ల తిప్పడం ద్వారా రూ.34లక్షల నుంచి రూ.36లక్షల(మహాలక్ష్మి) మేర ఆదాయం సమకూరుతోంది. పెంచిన బస్చార్జీలు(టోల్ యూజర్ చార్జీ) వల్ల మంచిర్యాల నుంచి హైదరాబాద్కు వెళ్లే ఒక్కో ప్రయాణికుడిపై రూ.10 చొప్పున మూడు టోల్ప్లాజాలు ఉండడం వల్ల రూ.30 వరకు అదనపు భారం పడుతోంది. మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్లే బస్సుల్లో రూ.10 టోల్ వసూలు చేస్తున్నారు. యాపల్ వరకు మినహాయిస్తే సోమగూడెం, బెల్లంపల్లి, తాండూర్, కాగజ్నగర్, ఆసిఫాబాద్కు వెళ్లే బస్సుల్లో ప్రతీ ప్రయాణికుడిపై రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇంకోవైపు కిలోమీటరు రౌండప్ చార్జీలు వసూలు చేస్తున్నారు. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ వెళ్లే ప్రయాణికులపై రూ.10 అదనపు భారం పడుతోంది. ఉదాహరణకు ఆదిలాబాద్ 166కిలోమీటర్లు కాగా 170 రౌండప్ కిలోమీటర్లు చేయడం వల్ల రూ.220 ఉంటే రూ.230 వసూలు చేయనున్నారు. మందమర్రి 13కిలోమీటర్లు ఉంటే 15 చేస్తారు. చిల్ల ర రౌండప్ పేరిట పెంచి రూట్లలో మాత్రం అన్ని మార్గాల్లో(స్టేజీలు) కిలోమీటరు రౌండప్ మార్చకపోవచ్చు. కిలోమీటర్లు ఏయే మార్గాల్లో అనేది స్పష్టత రావాల్సి ఉంది. మంచిర్యాల నుంచి కరీంనగర్, కాగజ్నగర్ వైపు వెళ్లే అన్ని రకాల బస్సుల్లో పాత చార్జీల కంటే రూ.10 పెరిగింది.
బస్సుపాస్లపై చార్జీల మోత
అన్ని రకాల బస్పాస్ చార్జీలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. 20శాతం మేర బస్సుపాస్ ధరలు పెంచింది. రూ.1150 ఉన్న ఆర్డీనరి బస్పాస్ ధర రూ.1400కు పెరిగింది. జిల్లాలో 499సీజనల్ పాస్లు, 777 స్టూడెంట్ పాస్లు ఉన్నాయి. నెలవారీ పాస్లు తీసుకునే వారి నుంచి 20రోజులు టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బస్పాస్ ధర రూ.1750 ఉంటే రూ.2150వరకు పెరిగింది. విద్యాసంస్థలు ప్రారంభమైతే ఎంతమేర స్టూడెంట్ పాస్ చార్జీలు పెరిగాయో తెలుస్తుంది. బస్చార్జీల బాదుడుకు అదనంగా బెల్లంపల్లి, కాగజ్నగర్ రూట్లలో ప్రయాణికులకు టోల్ యూజర్ చార్జీల భారం రూ.10 పడనునంది.
ఓ వైపు ఉచితం.. మరోవైపు వాత
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. దీంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. మరోవైపు టోల్చార్జీలు, బస్పాస్ చార్జీలు, కిలోమీటర్ రౌండప్ పేరిట వాత పెడుతోంది.
అక్కడ లోకల్ టోల్ మినహాయింపు..
ఆర్టీసీ బస్సులకు టోల్గేట్ వద్ద లోకల్ కన్సెషన్తో ప్రయాణికులపై భారం తగ్గించవచ్చు. ప్రస్తుతం రూ.30 టికెట్ ధర ఉంటే రూ.40 వసూలు చేస్తున్నారు. మంచిర్యాల డిపో నుంచి 20 నుంచి 30కిలోమీటర్లు ఉంటే జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిన బస్సులకు లోకల్ కన్సెషన్ వర్తింపు ద్వారా టోల్చార్జీల భారం తగ్గించవచ్చు. బెల్లంపల్లి, కాగజ్నగర్, ఆసిఫాబాద్ వైపు వెళ్లే బస్సులకు మందమర్రి టోల్గేట్ వద్ద లోకల్ కన్సెషన్ ఇవ్వడం వల్ల రూ.10 భారం తగ్గించే వీలుంది. ఉమ్మడి జిల్లాలోని దిలావర్పూర్ టోల్గేట్ వద్ద లోకల్ కన్సెషన్ కింద బస్సులకు సున్న చార్జీలు పడుతున్నట్లు తెలుస్తోంది. మందమర్రి టోల్గేట్ దగ్గర కూడా మినహాయించాలని పలువురు కోరుతున్నారు.
మంచిర్యాల–హైదరాబాద్ చార్జీలు(టోల్ యూజర్ చార్జీ కలిపి)
బస్సులు పాత బస్సు చార్జీలు పెరిగిన చార్జీలు
సూపర్ లగ్జరీ రూ.470(జెబీఎస్) రూ.500
రాజధాని రూ.600(జేబీఎస్) రూ.630
లహరీ నాన్ ఏసీ రూ.480 రూ.510
లహరీ ఏసీ రూ.620 రూ.650
ఎక్స్ప్రేస్ రూ.360 రూ.390

ప్రయాణికులపై ఆర్టీసీ బాదుడు