
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
● సొంత ఇంటి స్థలం ఉన్న తనకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఆర్థికసాయం అందించాలని చెన్నూర్ మండలం ఒతుకులపల్లి గ్రామానికి చెందిన మద్దూరి అఖిల కోరింది.
● మా తాత పేరిట ఉన్న భూమిని ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని మందమర్రికి చెందిన నాగుల కార్తీక్ ఫిర్యాదు చేశాడు.
● దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన నిమ్మల బాపు, తాను కొనుగోలు చేసిన భూమిని తన పేరిటా పట్టామార్పిడి చేయాలని హాజీపూర్ మండలం నంనూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య అర్జీ అందజేశారు.
● నస్పూర్ మండలం సీతారాంపల్లి శివారులో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారని జగిత్యాల జిల్లా జిల్లా బుగ్గారం మండలం గోపులపూర్ గ్రామానికి చెందిన నర్వేసి అస్మిత ఫిర్యాదు చేసింది.
● రేషన్కార్డు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు అందించానని, గతంలో మహారాష్ట్రలో ఉంటే తొలగించి ఇక్కడ దరఖాస్తు చేసుకున్నానని, మళ్లీ మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని మందమర్రి పట్టణంలోని దీపక్నగర్కు చెందిన మాటురి ఆనంద్ దరఖాస్తు అందజేశాడు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ