‘విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి’ | - | Sakshi
Sakshi News home page

‘విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి’

Jun 10 2025 3:28 AM | Updated on Jun 10 2025 3:28 AM

‘విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి’

‘విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి’

మంచిర్యాలఅగ్రికల్చర్‌: విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందిరా మహిళా భవనాలు, మహిళా సంఘాల పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని గుర్తించాలని సూచించారు. సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి అక్టోబర్‌ 2లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌, జిల్లా విద్యాధికారి యాదయ్య, వెనుబడిన తరుగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, రౌఫ్‌ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

రైతుల ఖాతాల్లో నగదు జమ

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో యాసంగి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ.360.10 కోట్లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 31,702 మంది రైతుల నుంచి 1,99,383 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

సన్నబియ్యం విక్రయిస్తే కార్డు రద్దు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం ఒకేసారి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని, అక్రమంగా విక్రయిస్తే చట్ట ప్రకారం కార్డు రద్దు చేస్తామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. ఈ నెల 30వరకు బియ్యం పొందవచ్చని తెలిపారు.

ఉపకరణాల కోసం దరఖాస్తుల స్వీకరణ

మంచిర్యాలఅగ్రికల్చర్‌: దివ్యాంగులకు సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రెట్రోఫిట్మెంట్‌ స్కూటీలు, బ్యాటరీ వీల్‌ చైర్స్‌, మొబైల్‌ బిజినెస్‌ బ్యాటరీ ట్రై సైకిళ్లు, హైబ్రిడ్‌ వీల్‌ చైర్లు, ల్యాప్‌టాప్‌లు, చేతికర్రలు, ట్రై సైకిళ్లు, వీల్‌ చైర్స్‌, క్రచెస్‌, వాకింగ్‌ స్టిక్స్‌ మంజూరైనట్లు తెలిపారు. దివ్యాంగులు https//tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 155326లో సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement