● పోలీసుల అదుపులో నిందితులు
● చిన్నారులను అపహరించే ముఠాగా
అనుమానం
● వెంబడించి పట్టుకున్న స్థానికులు
గద్వాల క్రైం: వస్త్ర దుకాణంలో చీరలు కొనుగోలు చేస్తున్నట్లు దుకాణదారుడిని నమ్మించి విలువైన చీరలను అపహరించారు ఆ మహిళలు. అక్కడి నుంచి ఆటోలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు ఏపీ 21టీఈ 3420 గల ఆటోలో పట్టణంలోని కృష్ణారెడ్డి బంగ్లా సమీపంలోని ఓ దుకాణంలో చీరలను కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అయితే దుకాణదారుడితో విలువైన చీరలను చూయించాల్సిందిగా నమ్మించి గుట్టుగా పలు చీరలను అపహరించారు. దుకాణదారుడికి అనుమానం రాకముందే అపహరించిన చీరలను ముందుగా వచ్చిన ఆటోలో తీసుకెళ్లారు. చీరల విషయంలో వ్యత్యాసం గమనించిన వ్యాపారి స్థానికుల సహాయంతో ఆటోను వెంబడించారు. రాఘవేంద్ర కాలనీ సమీపంలో ఆటోను అడ్డగించారు. దీంతో చీరలను అపహరించిన మహిళలను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు.


