జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి సాధించాలని, బూత్ స్థాయి అధికారులు మ్యాపింగ్ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం జరిగేలా కృషి చేయాలని తెలిపారు. బూత్స్థాయి అధికారులకు శిక్షణ అందించాలని, బూత్ స్థాయి ఏజెంట్లకు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు శిక్షణ సంబంధిత మెటీరియల్ అందజేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే నియమించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. వీసీలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, జేఎల్బీ హరిప్రియ, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.


