● ఉమ్మడి జిల్లాలో 94 పాఠశాలలకు రూ.4.40లక్షలు విడుదల
● బ్యానర్లు, పోస్టర్లతో ప్రచారం చేయాలని సూచన
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి.. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా విద్యార్థులను ఆకట్టుకునే విధంగా కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) స్కీం పాఠశాలలకు కేవలం ప్రచారం కోసమే ప్రత్యేకంగా నిధులను విడుదలచేసింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 94 పీఎంశ్రీ పాఠశాలలు ఉండగా.. రూ.4.40లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రచారం నిమిత్తం కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఉపాద్యాయులు ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాలలో సాధించిన విజయాలు, అందిస్తున్న వసతులు, బోధన సిబ్బంది తదితర అంశాలపై ప్రచారాన్ని నిర్వహించాలి. ఇందుకోసం ఉపాధ్యాయులు యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధుల సహాయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో డీఈఓ ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా.. ప్రచారం కోసం పీఎంశ్రీ పాఠశాలలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు.


