మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి తిరుచ్చి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చిసేవ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని గర్భగుడి నుంచి శోభయామానంగా అలంకరించిన తిరుచ్చివాహనంపై దేవస్థానం ముందున్న సభామండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, భక్తుల హరినామశ్చరణ మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. సభామండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని మళ్లీ గర్భగుడి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఈ సేవను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో మన్యంకొండకు తరలివచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు.


