మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లకు సంబందించి శిక్షణ తీసుకుని అర్హత సాధించిన విద్యార్థులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అందులో చాలా మంది విద్యార్థులు అర్హత సాధించడం గొప్ప విషయం అన్నారు. కొంత మంది విద్యార్థులకు ప్రతిభ ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రోత్సాహం ఉండదని, తల్లిదండ్రుల సహకారం ఉండదని తెలిపారు. ఒకవేళ తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో సహకరిస్తే విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ, నీట్ వంటి వాటిల్లో రాణిస్తారన్నారు. భవిష్యత్లో ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు ఎన్ఆర్ఐలు కూడా సహకరిస్తున్నారని, పేద విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల వారు సీట్లు సాధించారని, గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మేయర్ మమత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, నాయకులు వినోద్కుమార్, సిరాజ్ఖాద్రీ, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


