● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో గురువారం భూ భారతి, భూముల రీ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులకు రైతులు సహకరించాలని, అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయని, భవిష్యత్లో ఎలాంటి సమస్యలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లోని భూములను సర్వే చేసి భూధార్ కార్డులు ఇస్తారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వివరాలను భూధార్ కార్డు ద్వారా పొందుపరుస్తామని తెలిపారు. పకడ్బందీగా భూముల వివరాలను నమోదు చేసి నిజమైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోమ్ల తండా, పర్వతగిరి, లక్ష్మతండా సర్పంచులు ఇస్లావత్ సుజాతబాలాజీ, అనితవెంకన్న, గుగులోత్ ఈశ్వరిరవి నాయక్, ఆర్డీఓ రాజేశ్వరి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాస్, మండల సర్వేయర్ లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.


