మహబూబాబాద్ అర్బన్: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామర కిరణ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మదర్థెరిస్సా సెంటర్లో మంగళవారం ఎస్ఎఫ్ఐ నాయకులు కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలలో చెలగాటమాడుతుందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 70 పేపర్లు లీకై నట్లు ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోయారని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంధసిరి జ్యోతిబసు, పట్ల మధు, రాష్ట్ర నాయకులు దాసుగాని సుమ, జిల్లా నాయకులు రాకేష్, వీరేందర్, ఉదయ్, మహేష్, ఆకాష్, చందు, పవన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


