న్యూస్రీల్
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
జిల్లాలోని ఆనకట్టలు,
చెక్ డ్యామ్ల వివరాలు
వాగు ఆనకట్టలు చెక్డ్యామ్లు
ఆకేరు 02 12
మున్నేరు 03 15
పాలేరు 04 20
మొత్తం 09 47
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఆకేరు, మున్నేరు, పాలేరు వాగులు ప్రవహిస్తున్నాయి. వీటితోపాటు చెరువులు, కాల్వల ద్వారా మొత్తం 1,52,222 ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే ఇందులో తొమ్మిది ఆనకట్టల పరిధిలో 6,508 ఎకరాలు, 47 చెక్డ్యామ్ల పరిధిలో 6,950 ఎకరాలకు సాగునీరు అందుతోంది. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకు జిల్లాలోని కొమ్ములవంచ, ఉగ్గంపల్లి ఆనకట్టలు, అమ్మపాలెం, కొమ్ములవంచ, జయపురం, ముంగిమడుగు, ఉగ్గంపల్లి చెక్డ్యామ్ల్లో కొన్ని తెగిపోవడం, మరికొన్ని మరమ్మతులకు గురికా వడం, గేట్లు పాడవ్వడంతో నీరు నిల్వడం లేదు. వీటితోపాటు కొత్తగా మరికొన్ని కొత్త చెక్డ్యామ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ. 170కోట్ల నిధులు కావాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ఇందులో కొన్నింటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని పనులు ప్రారంభించగా.. మరికొన్నింటిని మాత్రం పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. దీంతో వేసవిలో ఎస్సారెస్పీ నుంచిజలాలు విడుదల చేసినా తెగిన చెక్డ్యామ్లలో నిల్వ లేదు.
ఇసుక కోసమే జాప్యమా..
జిల్లాకు మణిహారంగా ఉన్న ఆకేరు, మున్నేరు, పాలేరు వాగుల నుంచి ఇసుక విరివిగా లభిస్తుంది. ఎగువ భాగంలో కురిసిన నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంచేందుకు విరివిగా చెక్ డ్యామ్లు నిర్మించారు. అయితే తెగిన చెక్డ్యామ్లు, ఆనకట్టల మరమ్మతులు చేస్తే నీరు నిల్వ ఉంటుంది. ఆనకట్టలు, చెక్డ్యామ్ల పరిధిలోని ఆయకట్టే కాకుండా.. చుట్టూ కిలోమీటరు పరిధి వరకు భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. వీటి ఆధారంగా వేలాది ఎకరాల భూములు బోర్లు, బావుల ద్వారా సాగు చేసుకుంటారు. అయితే సంవత్సరాల తరబడి తెగిన చెక్ డ్యామ్లు, ఆనకట్టలు మరమ్మతులు చేయకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ లభించే ఇసుక అని ఆరోపణలు వస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల అనుచరులు ఇసుక దందా చేయడం పరిపాటి. ఇందుకోసమే చెక్డ్యామ్లు, ఆనకట్టలు మరమ్మతులు చేస్తే నీరు నిలిచి ఇసుక తీసేందుకు అవకాశం ఉండదు. అందుకోసమే మరమ్మతులు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తెగిన ఆనకట్టలు, చెక్డ్యామ్ల మరమ్మతులు చేయాలని, రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆనకట్ట మరమ్మతులు చేయాలి
నాకు ఆకేరువాగు పక్కనే మూడెకరాల పొలం ఉంది. ప్రతీ ఏడాది వానాకాలం, యాసంగి పంటలు పండేవి. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రశ్నార్థకంగా మారింది. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆకేరు వాగుకు వరద పోటెత్తి కుడి ఆనకట్టకు గండిపడి నీరంతా వృథాగా పోతోంది. వాగులో నీళ్లు లేకపోవడంతో భూగర్భజలాలు పడిపోయి బావులు, బోర్లు అడుగంటుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చెక్ డ్యామ్ కుడి ఆనకట్టకు మరమ్మతులు చేయాలి. అప్పుడే పంటలు పండుతాయి.
–జుజ్జూరి వెంకన్న, రైతు, ఉగ్గంపల్లి
తెగిన ఆనకట్టలు, చెక్డ్యామ్లకు
మరమ్మతులు కరువు
ఎస్సారెస్పీ, వర్షపు నీరు గంగపాలు
నీరు లేక ఎడారిని తలపిస్తున్న
ఆకేరువాగు
భూగర్భజలాలు ఇంకిపోవడంతో
రైతుల ఆందోళన
నాయకులు స్పందించాలని వేడుకోలు
నాడు జలకళ.. నేడు వెలవెల
బయ్యారం మండలంలోని అల్లిగూడెం–భీమ్లాతండా మధ్య ఉన్న పందిపంపుల వాగు ఇది. గంగారం మండల పరిధిలో వర్షం కురిస్తే ఈ వాగు ద్వారా వరదనీరు బయ్యారం పెద్ద చెరువులోకి చేరుతుంది. కాగా, గత ఏడాది జూన్ నెలలో నిండా నీటితో వాగు ప్రవహించగా.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల వాగు వెలవెలబోయి కనిపిస్తోంది.
–బయ్యారం
బావులు ఎండిపోయాయి..
ఆకేరు వాగు పక్కన ముంగిమడుగులో రెండు ఎకరాల భూమి ఉంది. చెక్డ్యామ్ తెగిపోవడంతో వాగులో నీరు నిల్వకపోవడంతో బావిలో నీళ్లు లేవు. నారు పోసుకోవడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. తెగిన చెక్ డ్యామ్కు మరమ్మతులు చేయడం మర్చిపోయారు. మరమ్మతులు చేస్తేనే మా వ్యవసాయ సాగుతుంది. లేకపోతే ఇబ్బందులే.
–గుగులోత్ పోట్యా నాయక్, పకీర తండా


