● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు, రక్షణే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన లక్ష్యమని ఎస్పీ శబరీష్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఆపరేషన్ ముస్కాన్ 12వ విడత పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఒక చిన్నారిని రక్షించడమంటే ఒక కుటుంబంలో మళ్లీ వెలుగులు నింపినట్లే అన్నారు. నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ఇటుక బట్టీలు, హోటళ్లు, పరిశ్రమలు తదితర ప్రాంతాల్లో పని చేస్తున్న బాలలను, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి రక్షించి వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వద్దకు చేర్చడమే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో బాలకార్మికులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్స్టేషన్ లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ఎస్.నాగవాణి, డీఎస్పీ గండ్రతి మోహన్, సీఐ హతీరాం, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


