వరంగల్ అర్బన్: వేధింపులు తాళలేక ఓ మహిళా ఉద్యోగి సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. ఏడాది క్రితం నర్సంపేట మున్సిపాలిటీ నుంచి శాశ్వత ఉద్యోగి శ్రుతి వరంగల్ బల్దియాకు బదిలీపై వచ్చి డిప్యుటేషన్పై ఇన్వార్డు సెక్షన్లో విధులు నిర్వర్తిస్తోంది. ఇన్వార్డులో నమోదవుతున్న ఫైళ్లను సకాలంలో ఆయా విభాగాలకు పంపించకపోవడంతో అదనపు కమిషన్ ఇసంపల్లి జోనా, సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్.. ఇన్వార్డు సెక్షన్ సిబ్బందిని సోమవారం పిలిచి క్లాస్ తీసుకున్నారు. కొత్త కమిషనర్ ఫైళ్లపై సమీక్షిస్తే ఏం సమాధానం చెబుతారని మందలించినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రుతి నర్సంపేట మండలంలోని తన ఇంటికి వెళ్లి అల్లోపతి మాత్రలను మింగింది. కుటుంబ సభ్యులు ఆమెను నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఓ వీడియోలో తన ఆవేదన వెళ్లగక్కింది. తాను మాత్రమే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నానని, అక్కడి నుంచి అంతర్గత బదిలీ చేస్తామంటూ బెదరింపులకు పాల్పడడంతో ఇంట్లో ఉన్న అల్లోపతి మాత్రలను మింగినట్లు వెల్లడించింది. సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్, అటెండర్ చందన తనపై కక్షపూరితంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం శ్రుతి ఆరోగ్య పరిస్థితి కుదుటపడినట్లు తెలిసింది. ఈ విషయంపై బల్దియా కమిషనర్ వెంకన్న మంగళవారం ఆరా తీశారు. సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్ వివరణ సమర్పించినట్లు తెలిసింది. ఈ ఘటనపై అడిషనల్ జోనా, సూపరింటెండెంట్ ఆనంద్ను వివరణ కోరగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించడం తగదని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించినట్లు తెలిపారు. ఇదేకాకుండా సీ–1 సెక్షన్ సూపరింటెండెంట్ ఆనంద్ తన వద్ద డబ్బులు డిమాండ్ చేశారని ఇటీవల తొర్రూరు మున్సిలిటీ హెల్త్ అసిస్టెంట్ వాయిస్ రికార్డు చేసిన సంఘటన వైరల్గా మారింది.
సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలి
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
కేయూ క్యాంపస్: సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం అన్నారు. ద్రవిడియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘అండర్ స్టాండింగ్ డ్రవిడియన్ సొసైటీ అండ్ పాలిటిక్స్’ అనే పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈఏడాది మే 9, 10 తేదీల్లో నిర్వహించిన సదస్సుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను పుస్తకం రూపంలోనికి తీసుకురావడం ఎంతో ప్రయోజనకరమన్నారు. కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ కృష్ణయ్య, పీవీ నర్సింహారావు నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వడ్లకొండ సత్యనారాయణ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాలాకుల కొమురయ్య, ద్రవిడ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు, ఉపాధ్యక్షుడు సోమలింగం, సహాయ కార్యదర్శి నరేష్కుమార్, కోశాదికారి డాక్టర్ ప్రశాంత్, కార్యవర్గసభ్యులు సురేష్, లీలావతి, పరిశోధక విద్యార్థిని రుబీనా పాల్గొన్నారు.


