ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీల ద్వారా 99 రోజుల్లో రూ.63,70,531 ఆదాయం సమకూరినట్లు మేడారం ఈఓ వీరస్వామి తెలిపారు. ఈ ఏడాది మార్చి 24 నుంచి జూన్ 30 వరకు గద్దెలపై ఉంచిన మొత్తం 40 హుండీల్లోని కానుకలను మంగళవారం మేడారంలోని ఎండోమెంట్ డార్మెటరీ భవనంలో పూజారుల సమక్షంలో లెక్కించారు. ఇందులో సమ్మక్క హుండీ ఆదాయం రూ.34,05,959, సారలమ్మ హుండీ ఆదాయం రూ.25,59,430, గోవిందరాజు హుండీ ఆదాయం రూ.2,26,266, పగిడిద్దరాజు హుండీ ఆదాయం రూ.1,78,876 వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ క్రాంతి, ఇన్స్పెక్టర్ అనిల్, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కిరణ్, సారయ్య, మునీందర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
‘భద్రకాళి’ ఆదాయం రూ.85,03,997
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలోని హుండీల్లోని కానుకలను లెక్కించగా.. రూ.85,03,997 ఆదాయం సమకూరినట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. మూడు నెలల ఆరు రోజుల్లోలకు సంబంధించి కానుకను మంగళవారం యూనియన్ బ్యాంక్లో జమ చేసినట్లు తెలిపారు. 200 యూఎస్ఏ డాలర్లు, 260 కెనడా డాలర్లు, 30 యూఏఈ దిరమ్స్, 30 ఇంగ్లండ్ పౌండ్స్, 300 ఓమన్, 2 సింగపూర్ డాలర్లు భక్తులు హుండీల్లో వేసినట్లు గుర్తించామని తెలిపారు. లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షాణాధికారిగా దేవాదాయ ధర్మాదాయశాఖ వరంగల్ ఉప కమిషనర్ కార్యాలయ పర్యవేక్షకులు గౌరీశంకర్ వ్యవహరించారు. అర్చకులు భద్రకాళిశేషుతోపాటు ఆలయసిబ్బంది, శ్రీలక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ అధ్యక్షుడు జి.కృష్ణారెడ్డి, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సేవా సమితి జి.నవీన్, 200 మంది సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు.


