హన్మకొండ : గిరిజనుల అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో వికసిత్ తెలంగాణ కోసం గిరిజనుల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి హనుమకొండకు చేరుకున్న నితిన్ నబీన్కు హరిత హోటల్ వద్ద గిరిజన సంప్రదాయప్రకారం స్వాగతం పలికారు. అనంతరం గిరిజనుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మావోయిస్టులు ఉన్నచోట ఇంతకాలం గిరిజనుల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. నక్సలైట్ల సమస్య సమసిపోయిందన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడెం నగేశ్, కేంద్ర మాజీ మంత్రి అమర్సింగ్ తివారీ, నాయకులు కల్యాణ్ నాయక్, సోలంకి శ్రీనివాస్, బాబీ, రితేష్ రాథోడ్ పాల్గొన్నారు.
భద్రకాళికి పూజలు
హన్మకొండ కల్చరల్: వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయాన్ని సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వేర్వేరుగా సందర్శించారు. వీరితోపాటు పార్టీ , ఈ సందర్భంగా వారికి ప్రధానార్చకులు భద్రకాళి శేషు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. ముందుగా గోమాతకు ప్రదక్షిణ చేసి ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.
నితిన్ నబీన్ కాన్వాయ్ని అడ్డుకున్న ఎన్ఎస్యూఐ నేతలు
హన్మకొండ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాన్వాయ్ను కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. సోమవారం హనుమకొండ పర్యటనకు వచ్చిన నితిన్ నబీన్ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే బీజేపీ ఉమ్మడి జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కాన్వాయ్ తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలి దాటగానే అడ్డంగా పరుగెత్తుకొచ్చారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుతొలగించి అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం వదిలేశారు.
వరంగల్ పోలీసులపై కేంద్ర మంత్రి
ఆగ్రహం..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాన్వాయ్ను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకునే విషయంలో పోలీసుల తీరుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎస్యూ నాయకులు న్యూసెన్స్ చేస్తుంటే పోలీసులు సైలెంట్గా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ఎస్యూ నాయకుల న్యూసెన్స్పై ముందుస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వరంగల్ పోలీసుల నిర్లక్ష్యంపై కేంద్ర నిఘావర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు
నితిన్ నబీన్ సిన్హా


