● విద్యుదాఘాతంతో యువకుడి మృతి
చిట్యాల: మానేరు వాగులో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామ శివా రులో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మనబోతుల రఘుపతి, బిస్కుల ఈశాంత్, ఏదుల రంజిత్, భుక్యా సమ్మయ్య గ్రామ శివారులోని మానేరు వాగులో విద్యుత్ తీగలతో చేపల వేటకు వెళ్తూ మేకల రాజు(30)కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. దీనికి మొదటగా రాజు నిరాకరించినా బలవంతంగా ఒప్పించి తీసుకెళ్లారు. వాగు వద్ద అక్రమంగా మోటారు స్టార్టర్ ఫ్యూజ్ నుంచి తీగలు లాగి నీటిలో కరెంట్ షాక్ పెడుతూ చేపలు పట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో కట్టె విద్యుత్ వైరుకు అడ్డు రావడంతో వాగు ఒడ్డున ఉన్న రాజును పిలిచి ఆ వైరును తీయమని కోరారు. దీంతో ఆ కట్టెను తీస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నలుగురిని పోలీసులు అదుపుతోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి దేవక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీశ్ తెలిపారు. మృతుడికి భార్య మళ్లీశ్వరి ఉంది.


