● కలెక్టర్ స్నేహ శబరీష్
దంతాలపల్లి: ప్రతీ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయులు చెబుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. గ్రంథాలయం, పాఠశాల ఆవరణను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆంగ్ల భాషను సులభంగా అర్థమయ్యేలా బోధించాలని, వారిలో నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉందన్నారు. అనంతరం మండలకేంద్రంలో నిర్వహిస్తున్న విత్తనమేళాను పరిశీలించారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి, నేలకు మేలు చేసే నానో యూరియాను వాడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునిల్కుమార్, ఎంఈఓ శ్రీదేవి, ప్రధానోపాధ్యాయుడు వేణు మాధవరెడ్డి, ఏఓ వాహిని, ఏఈఓ హర్షవర్దన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


