హన్మకొండ అర్బన్: మహిళల గౌరవాన్ని కాపాడినప్పుడే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని గార్డియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ పి.స్వర్ణలత అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ డిగ్రీ, పీజీ మహిళా కళాశాలలో ‘డిగ్నిటీ అండ్ డ్రైవ్ ఫ్యూయలింగ్ ఉమెన్ సేఫ్టీ అండ్ గ్రోత్ ఇన్ ఇండియా’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ మహిళలకు స్వేచ్ఛ, గౌరవాన్ని ఇచ్చినప్పుడే వారు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారన్నారు. తాను ఈ కళాశాల పూర్వ విద్యార్థిని కావడం గర్వకారణమని పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీ న్యాయ కళాశాల పూర్వ డీన్ ప్రొఫెసర్ విజయ్చందర్ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం, వారి హక్కులను పరిరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యతని అన్నారు. మహిళలు ప్రతిభ, మేధస్సుకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. సదస్సులో భాగంగా నిర్వహించిన టెక్నికల్ సెషన్లో వివిధ కళాశాలల ఉపన్యాసకులు, పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించగా, వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం అతిథులను శాలువాలు, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ప్రశాంతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అరుణ, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేశ్బాబు, అకడమిక్ కోఆర్డినేటర్ ఎం.అరుణ, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఇతర కళాశాలల ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ సదస్సులో డాక్టర్ స్వర్ణలత


