మహబూబాబాద్ రూరల్: మానుకోట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యుల పనితీరుపై ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ బుధవారం జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్య సేవలపై ప్రస్తావించారు. మహబూబాబాద్ పట్టణం జిల్లాగా ఏర్పడకముందు 100 పడకల ఏరియా ఆస్పత్రిగా ఉండేదని, జిల్లా ఏర్పాటుతో 300 పడకలకు అప్గ్రేడ్ చేశారన్నారు. దీంతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చిందని, ఇది మంచి పరిణామం అయినప్పటికీ తదనంతరం వైద్య విధాన పరిషత్ పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. వైద్య విధాన పరిషత్ వైద్యులు, డీఎంఈ, సంబంధిత వైద్య సిబ్బంది ఆస్పత్రిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఆస్పత్రికి రోజుకు వెయ్యిమంది రోగులు వైద్యం కోసం వస్తుండగా వారికి సరైన సేవలు అందించేందుకు సరిపడా వైద్యులు లేరన్నారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ప్రసూతి ఆస్పత్రిగాగా మార్చాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు పూర్తి చేయాలని కోరారు.
జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే మురళీనాయక్


