జనగామ: ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయం, ఇరిగేషన్పై చిన్నచూపు చూసిందని, ఈ బడ్జెట్ పేరుగొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడారు. బడ్జెట్లో మహిళలు, యువత, పెన్షనర్లు, ఉద్యోగులకు ఐదు పీఆర్సీలు, ఒక డీఏ పెండింగ్, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికుల కోసం ఊసే ఎత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు స్కూటీ, వృద్ధులకు రూ. 4వేల పింఛన్, రైతులకు పెట్టుబడి కింద రూ.15వేలు, రాజీవ్ యువ వికాసానికి రూ.6వేల కోట్లు, అంబేడ్కర్ అభయ హస్తం కింద ఒక్కొక్కరికి రూ.12 లక్షలు, షాదీముబాక్, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, బీసీ వర్గాలకు ప్రతీ సంవత్సరం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని..బడ్జెట్లో గుండుసున్నా చూపించారన్నారు. బడ్జెట్ అంచనాలకు అటు ఇటుగా ఉండాలే తప్ప, మొత్తానికి మొత్తం జీరో చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన రెండున్నరేళ్లలో రూ.3.80 లక్షల కోట్లు అప్పు చేసి జీరో అభివృద్ధిని చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఇర్రి రమణారెడ్డి, తాళ్ల సురేష్రెడ్డి, సేవెల్లి మధు, గునిగంటి వెన్నెల, మామిడాల రజిత, అనూష, అనిత, ఉల్లెంగుల సందీప్, నీల యాదగిరి తదితరులు ఉన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులోని వనిత టీస్టాల్ను యథాస్థానంలోనే ఉండే విధంగా కలెక్టర్ చొరవ చూపించాలని ఎమ్మెల్యే కోరారు.
ఆరు గ్యారంటీలకు డబ్బులు ఏవి?
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి


