
ఈవీ బస్సులు..
ప్రతీ రోజు 10 బస్సులకు తగ్గకుండా మరమ్మతులు..
గుదిబండగా
నేడు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి రాక
టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆదివారం వరంగల్ పర్యటనకు వస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డి తొలి పర్యటన వరంగల్ రీజియన్లో కొనసాగనుంది. వరంగల్ రీజియన్ పరిస్థితులపై ఈ పర్యటనలో అధ్యయనం చేసి అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వనున్నారు. ఎండీ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్పాయింట్ల వద్ద ఏ రూట్ బస్సులు నిలుపుతారో వివరాలతో కూడిన స్టిక్కర్లు అంటించారు.
హన్మకొండ: ఎలక్ట్రిక్ బస్సులు(ఈవీ).. టీజీఎస్ ఆర్టీసీకి గుదిబండగా మారాయి. తరచూ వైఫల్యాలతో ప్రయాణికులతోపాటు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు? ఎక్కడ? ఆగుతుందో తెలియని పరిస్థితుల్లో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల తీరు ఉందని ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. ప్రతీ రోజు 10 నుంచి 20 బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. మరమ్మతులు చేసేందుకు అవసరమైన విడిభాగాలు అందుబాటులో లేక రోజుల తరబడి నిరుపయోగంగా ఉంటున్నాయి. ఫలితంగా బస్సులు అందుబాటులో లేక విధులకు వచ్చే కండక్టర్లకు నిరీక్షణ తప్పడం లేదు. రోజంత డిపోలోనే నిరీక్షించి డ్యూటీ లేకుండానే తిరిగి వెళ్తున్నారు. మరుసటి రోజు వస్తే ఆ రోజు కూడా డ్యూటీ ఉంటుందో లేదో తెలియని దుస్థితి టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–2 డిపోలో నెలకొందని ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. వెయిటింగ్తో విసిగి వేసారి పోతున్నామని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని వారు వాపోయారు.
ట్రాఫిక్ విధులు నిర్వహించే ఓ అధికారి తీరుతో మానసికంగా కృంగిపోతున్నామని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. అవసరాలకు సెలవు ఇవ్వాలని కోరితే ససేమిరా అంటోందని వారు వాపోతున్నారు. కాగా, యాజమాన్యం సంస్థ అవసరాల కోసం సీనియర్ ఉద్యోగులకు అసిస్టెంట్ డిపో క్లర్క్ (ఏడీసీ)లుగా పదోన్నతి కల్పించింది. ప్రతీ డిపోలో అవసరం మేరకు ఏడీసీ (కంట్రోలర్)లను నియమించింది. వారు అందుబాటులో ఉన్నా.. కంట్రోలర్ను కాదని కండక్టర్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కండక్టర్ బుకింగ్ బాధ్యతలు అప్పగించడంపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. యాజమాన్యం అదనపు బాధ్యత (ఓడీ)లను రద్దు చేసినా వరంగల్–2 డిపోలో అదనపు బాధ్యతతో కండక్టర్ను తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కార్బన్ ఉద్గారాలను భారీగా తగ్గించి స్వచ్ఛమైన రవాణ వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ రీజియన్కు మొత్తం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా, జేబీఎం ఎకోలైఫ్ సంస్థ 112 బస్సులు సరఫరా చేసి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. టీజీఎస్ ఆర్టీసీతో కలిసి బస్సులు నడపుతోంది. మొత్తం 112 బస్సుల్లో ఇందులో సూపర్ లగ్జరీ 21, డీలక్స్ 22, ఎక్స్ప్రెస్ బస్సులు 69 ఉన్నాయి. వీటిని హనుమకొండ నుంచి హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, సూర్యాపేట, సిద్దిపేట, కాళేశ్వరం, ఖమ్మం రూట్లలో నడుపుతున్నారు. అయితే ఈ బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతీ రోజు 10 బస్సులకు తగ్గకుండా ఫెయిలవుతున్నాయి. ప్రతీ రోజు 15 వేల కిలో మీటర్లు రద్దవుతుందని అధికారులు తెలిపారు.
తరచూ మరమ్మతులకు
గురవుతున్న పరిస్థితి
బస్సులు అందుబాటులో లేక
విసిగిపోతున్న కండక్టర్లు
రోజంతా నిరీక్షించి ఇంటికెళ్తున్న
ఉద్యోగులు
జేబీఎం బస్సులపై ఆర్టీసీ ఉదాసీనత..
ఆర్టీసీ అద్దె బస్సులు మరమ్మతుకు గురై ఒక్క రోజు నడపకుంటే రూ.2 వేలు జరిమానా విధిస్తున్న ఆర్టీసీ.. జేబీఎం బస్సులు పదుల సంఖ్యలో నిలిచిపోతున్నా ఎలాంటి జరిమానా విధించకుండా ఉదాసీనత ప్రదర్శిస్తోంది. ఉద్యోగాలు రాక ఉపాధి కోసం ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు నడుపుతున్న వారికి మాత్రం జరిమానా విధిస్తూ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ అన్ని విధాలా సహకరిస్తోందనే విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. అద్దె చెల్లింపులోనూ ఆ బస్సుల యజమానులకు ఆర్టీసీ వివక్ష చూపుతోంది. జేబీఎం బస్సులకు కిలో మీటర్కు రూ.39.90 చొప్పున చెల్లిస్తుండగా, ప్రైవేట్ అద్దె బస్సులకు రోజు తిరిగే కిలో మీటర్లను బట్టి రూ.6 నుంచి రూ.15 వరకు చెల్లిస్తోంది. అద్దె ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు నడవకున్నా చూసీచూసినట్లు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లేని బస్సులతో డ్రైవర్లు నష్టపోతున్నారని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. బస్సు బాడీ డ్యామేజీ అయితే డ్రైవర్ల నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

ఈవీ బస్సులు..