
మరిన్ని ‘రైతు నేస్తాలు’
మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల్లో రైతు నేస్తాల పేరిట వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) యూనిట్లను ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ, ఉద్యాన, ఆయా శాఖల అనుబంధ పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా వ్యవసాయశాఖకు 16 వీసీ యూనిట్లను మంజూరు చేయగా వాటి ద్వారా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సేవలు అందిస్తున్నారు. కాగా మరో 36 వీసీ యూనిట్లను మంజూరు చేయగా నేడు ప్రారంభించనున్నారు.
సలహాలు, సూచనలు..
హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉంటూ పంటల సాగు సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, సాధించాల్సిన దిగుబడులపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సీజన్ల వారీగా రైతులు ఏయే పంటలు ఏ విధంగా సాగు చేయాలనే అంశాలు, వినియోగించాల్సిన పురుగు మందులు, ఎరువులు, సేంద్రియ సాగుపై శిక్షణ ఇస్తూ రైతులు పంటల సాగులో అవలంబించాల్సిన అధునాతన సాంకేతిక పద్ధతులపై వివరిస్తున్నారు.
నేడు 36 రైతు నేస్తాలు ప్రారంభం..
జిల్లాలో 82 రైతు వేదికలు ఉండగా ప్రస్తుతం 16 రైతు వేదికల్లో వీసీ యూనిట్లు ఉండగా.. మరో 36 రైతు వేదికల్లో రైతు నేస్తాల యూనిట్లను సోమవారం ప్రారంభిస్తారని డీఏఓ ఎం.విజయలక్ష్మి తెలిపారు. సీరోలు మండల పరిధిలో కాంపల్లి, తాళ్లసంకీస, మన్నెగూడెం, బయ్యారం మండల పరిధిలో బయ్యారం, రామచంద్రాపురం, ఇనుగుర్తి మండలం పరిధిలో ఇనుగుర్తి, చిన్నముప్పారం, పెద్దవంగర మండలం పరిధిలో అవుతాపురం, చిట్యాల, గార్ల మండల పరిధిలో ముల్కనూరు, పోచారం, నెల్లికుదురు మండలం పరిధిలో ఆలేరు, మునిగలవీడు, గంగారం మండల పరిధిలో కోమట్లగూడెం, మర్రిగూడెం, నర్సింహులపేట మండలం పరిధిలో పెద్దనాగారం, కౌసల్యదేవిపల్లి, మరిపెడ మండల పరిధిలో ధర్మారం, చిల్లంచర్ల, కొత్తగూడ మండల పరిధిలో పొగుల్లపల్లి, బత్తులపల్లి, దంతాలపల్లి మండల పరిధిలో పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, కేసముద్రం మండల పరిధిలో పెనుగొండ, ఉప్పరపల్లి, మహబూబాబాద్ మండలం పరిధిలో మల్యాల, జంగిలిగొండ, గూడూరు మండలం పరిధిలో గూడూరు, మర్రిగూడెం, తొర్రూరు మండలం పరిధిలో వెలికట్టె, తొర్రూరు, చిన్నగూడూరు మండలం పరిధిలో జయ్యారం, కురవి మండల పరిధిలో కురవి, బలపాల, డోర్నకల్ మండల పరిధిలో గొల్లచర్ల, డోర్నకల్ రైతు వేదికల్లో నూతనంగా వీసీ యూనిట్లు ఏర్పాటు చేశారు.
రైతులతో ముచ్చటించనున్న సీఎం..
మూడో దశలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రారంభించి రైతులతో ముచ్చటిస్తారు. సోమవారం సాయంత్రం 3గంటలకు జిల్లాలోని 52 వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు గల రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతు అధిక సంఖ్యలో పాల్గొనాలని డీఏఓ విజయనిర్మల కోరారు.
జిల్లాలో నేడు 36 వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ప్రారంభం