
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
● రూ.1.30 లక్షల నగదు అపహరణ
● గంగారంలో ఘటన
కాటారం : తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం కాటారం మండలం గంగారంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధురాలు సంతోషం గౌరక్క ఒంటరిగా నివసిస్తోంది. నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు తలుపు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తెరిచి అందులో ఉన్న రూ.1.30 లక్షల నగదును అపహరించుకెళ్లారు. శనివారం ఇంటికి చేరుకున్న గౌరక్క తలుపు తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించి బీరువా వద్దకు వెళ్లి చూడగా అందులో నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుంది. వెంటనే చుట్టు పక్కల వారికి తెలుపగా పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు, క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. చోరీపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై అభినవ్ తెలిపారు.