
శిథిలావస్థలో ‘డబుల్ ఇళ్లు’
డోర్నకల్: మండలంలోని వెన్నారం గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఇళ్ల పంపిణీ అటకెక్కింది. 2017లో 72 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాగా 2019లో 18ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి విద్యుత్, సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. అయితే లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. విద్యుత్ మీటర్లు ఊడి, కిటికీల అద్దాలు పగిలి ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. అలాగే కొద్ది రోజుల క్రితం మధ్యలో నిచిలిపోయిన మరో 26ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి నోచుకోవడం లేదు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం 440 దరఖాస్తులు..
వెన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 440 మంది దఖాస్తు చేసుకున్నారు. ఇటీవల మొదటి విడతలో 28మందికి ఇళ్లు మంజూరయ్యాయి. కాగా 23 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. వీరిలో చాలామంది ముగ్గులు పోసుకుని ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు.
వెన్నారంలో 72ఇళ్ల
నిర్మాణానికి శ్రీకారం
44ఇళ్లు పూర్తి..
పంపిణీపై దృష్టి సారించని అధికారులు
ఇందిరమ్మ ఇళ్ల కోసం 440
దరఖాస్తులు.. 28మందికి మంజూరు

శిథిలావస్థలో ‘డబుల్ ఇళ్లు’