
కాజీపేట జంక్షన్లో అధికారుల తనిఖీలు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్లో కొన్ని నెలల నుంచి కొనసాగుతున్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, ఇతర అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ అధికారులు బుధవారం సంయుక్తంగా తనిఖీ చేశారు. సికింద్రాబాద్ అడిషనల్ రైల్వే మేనేజర్ గోపాల్, సీనియర్ డీసీఎం షిపాలి, డీఓఎం జనరల్ సురేశ్కుమార్, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్ కేశర్వాణి తనిఖీ చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, స్టేషన్లోని క్యాంటీన్, ప్లాట్ఫామ్లపై స్టాళ్లు, రైల్వే కాలనీలో నిర్మిస్తున్న రన్నింగ్ రూ మ్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం కాజీ పేట జంక్షన్ అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, ఏడీఈఎన్ సంతోశ్, అన్ని విభాగాల అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
ఈఆర్ఏఆర్ఎం వ్యాన్ కూడా..
రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు హుటాహుటిన ఘటనాస్థలికి తరలివెళ్లే ఎమర్జెన్సీ రైల్వే యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్(ఈఆర్ఏఆర్ఎం)ను బుధవారం సికింద్రాబాద్ రైల్వే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) నారాయణస్వామి తనిఖీ చేశారు. వ్యాన్లో నిల్వ ఉండే మందులు, వైద్య పరికరాలు, ఇతరత్రా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించే వైద్య సదుపాయాల సెటప్ కిట్లను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక రైల్వే ఆస్పత్రి వైద్యాధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే ఆస్పత్రి వైద్యులు నిరంజన్రావు, యాకూబ్, చీఫ్ ఫార్మసిస్ట్ చింత తిరుపతి, నర్సింగ్ సూపరింటెండెంట్ సుధీర్, రాజు, లక్ష్మీనారాయణ, సతీశ్, లక్ష్మి పాల్గొన్నారు.
ముగిసిన రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంపికలు బుధవారం ముగిశాయి. డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ పర్యవేక్షణలో జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్ క్రీడాంశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఎంపికల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు అశోక్కుమార్ తెలిపారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి త్వరలో వ్యక్తిగతంగా సమాచారం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో శాట్ పరిశీలకులు డాక్టర్ రవికుమార్, నర్సింగరావు, స్వర్ణలత, సంతోశ్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పవన్, కరీం, స్వామిచరణ్, డీఎస్ఏ కోచ్లు పాల్గొన్నారు.

కాజీపేట జంక్షన్లో అధికారుల తనిఖీలు

కాజీపేట జంక్షన్లో అధికారుల తనిఖీలు