
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
● కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరికి షాక్
● తండాధర్మారం గ్రామంలో సంఘటన
మరిపెడ రూరల్: విద్యుదాఘాతంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. అతడిని కాపాడే యత్నంలో మరో ఇద్దరు షాక్కు గురయ్యారు. ఈ ఘటన సోమవారం మరిపెడ మండలం తండాధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ధరంసోత్ పత్యానాయక్ (70) ఎదురింటి కప్పుపై పట్టాలు కల్పి దానికి ఇనుప తీగ బిగించారు. కరెంట్ తీగ ఆ ఇంటిపై బిగించిన ఇనుప తీగకు ఆనుకుని విద్యుత్ సరఫరా అయ్యింది. ఈ క్రమంలో పత్యానాయక్ ఆ ఇంటి ఎదుట పని చేస్తుండగా ఇనుప తీగ తగలడంతో షాక్ తగిలి కిందపడ్డాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో మనవడు సతీశ్, కోడలు బుజ్జి షాక్ గురయ్యారు. ఇది గమనించిన మరో మనవడు రాజేశ్ కర్ర సాయంతో వారిని రక్షించాడు. ప్రాణాపాయస్థితి నుంచి కోడలు, మనవడు బయటపడగా పత్యానాయక్ మాత్రం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
కారు బోల్తా..
ముగ్గురికి గాయాలు
మడికొండ: ప్రమాదవశాత్తు కారు బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మడికొండ–ధర్మసాగర్ రోడ్డులో సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం దామెరకు చెందిన అశోక్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తు కారులో పని నిమిత్తం హనుమకొండకు వెళ్లి తిరిగి మడికొండ నుంచి ధర్మసాగర్ వైపు వెళ్తున్నాడు. ధర్మసాగర్ పెట్రోల్ పంపు సమీపంలో టైరు బ్లాస్ట్ కావడంతో కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో అశోక్తో పాటు అతని కుటుంబ సభ్యులకు సైతం గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం 108వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి