
ఉపాధ్యాయుల సర్దుబాటు
సాక్షి, మహబూబాబాద్: నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే పుస్తకాలు, నోట్బుక్స్తోపాటు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాం పంపిణీకి కసరత్తు ముమ్మరం చేశారు. దీంతోపాటు బోధన సక్రమంగా సాగేందుకు ఉపాధ్యాయుల కొరతను గుర్తించి మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ.. అధికారులను ఆదేశించింది. ఈమేరకు సర్దుబాటు ప్రక్రియను మొదలు పెట్టారు.
ఉపాధ్యాయుల కొరత..
ప్రతీ పాఠశాలలో సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల కొరత ఉండకుండా చూడాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలను గుర్తిస్తున్నారు. జిల్లాలో డీఈఓ పరిధిలో పనిచేసే పాఠశాలలు 898 ఉన్నాయి. ఇందులో 15కేజీబీవీలు, ఎనిమిది మోడల్ స్కూల్స్ పోగా మిగిలిన 898 పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించారు. అయితే గత ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలు చేపట్టారు. ఇలా జిల్లాలో మొత్తం 3,297 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో 1,730 ఎస్జీటీలు, 1,390 అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లు ఉండగా మరో 177 మంది భాషా పండితులు, పీడీలు, పీఈటీలు ఉన్నారు. అయితే 102 హైస్కూళ్లలో ఇటీవల అప్గ్రేడ్ అయిన మహబూబాబాద్ మండలం శనిగపురం, ముడుపుగల్లు, మాధవపురం, గూడూరు మండలం పొనుగోడు, డోర్నకల్ మండలం మన్నెగూడెం, దంతాలపల్లి మండలం రేపోని, కొత్తగూడ మండలం మత్తులపల్లి హైస్కూళ్లలో సరిపడా ఉపాధ్యాయులు లేరు. ప్రధానంగా ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయులు 25 మంది అవసరం. కాగా జూన్, జూలైలో పదవీ విరమణ పొందే వారు 12 మంది మేరకు ఉంటారు. వీరితోపాటు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లినవారు ఉన్నారు. ఈమేరకు మొత్తం 50 మంది మేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.
మిగులు ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి..
రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రూపొందించిన నిబంధనల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి. అయితే జిల్లాలో ఇప్పటికే 154 పాఠశాలలు విద్యార్థులు లేక మూత పడ్డాయి. విద్యార్థుల సంఖ్య తక్కువ, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఇలా అన్ని లెక్కలు వేస్తే వెయ్యి మంది మేరకు ఉపాధ్యాయులు సర్ప్లస్గా ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా అమలు చేయాల్సి వస్తే సర్ప్లస్ ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని ఉపాధ్యాయ సంఘాల్లో చర్చ. అందుకోసమే ప్రీప్రైమరీ పాఠశాలలు పెట్టడం, బడి బాట ద్వారా మూత బడిన బడులను తెరిపించడం మొదలైన కార్యక్రమాలు చేస్తేనే కేటాయించిన చోట ఉంటారు. లేకపోతే ఎక్కడికై నా బదిలీ చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఉపాధ్యాయులకు హెచ్చరికలు కూడా వచ్చినట్లు తెలిసింది.
నిబంధనల మేరకు..
ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. బడి బాట కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల సహకారంతో మూత బడిన పాఠశాలలు తెరిచే పనిలో ఉన్నాం. ఈ ఏడాది ప్రీప్రైమరీ పాఠశాలలు కూడా ప్రారంభిస్తున్నాం.
– రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి
కోరుకున్న చోటుకు పంపించండి
మారుమూల ప్రాంతాల్లో పనిచేసే కొందరు ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియను అడ్డుపెట్టుకొని, వారికి అనుకూలంగా ఉండే చోటుకు వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇందుకోసం ముఖ్యమంత్రి సన్నిహితులతోపాటు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఒక జాబితాను తయారు చేసి కోరుకున్న చోటుకు పంపించేలా చూడాలని ఇప్పటికే డీఈఓను కోరినట్లు తెలిసింది. ఇలా ఒక వైపు ఉన్నతాధికారుల ఆదేశాలు, మరోవైపు ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ఇంకోవైపు సంఘాల పైరవీలు.. ఈ నేపథ్యంలో అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
పాఠశాల సంఖ్య ఉపాధ్యాయులు
ప్రభుత్వ 02 36
డీఎన్టీ పీఎస్ 24 48
ఎంపీపీ– జెడ్పీపీ 873 3,213
పీఎస్, యూపీఎస్లో ఉపాధ్యాయులు ఇలా ఉండాలి
విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల
సంఖ్య
1–10 మంది 01
11–60 మంది 02
61–90 మంది 03
91–120 మంది 04
121–150 మంది 05
151–200 మంది 06
జిల్లా విద్యాశాఖలో ప్రక్రియ షురూ
అప్గ్రేడ్ హైస్కూళ్లలో టీచర్ల కొరత
ఎస్జీటీల్లో మిగులు ఉపాధ్యాయులు
మంచి పోస్టుల కోసం పైరవీలు
ఎస్జీటీలు : 1,730
ఎస్ఏ : 1,390
ఎల్పీ : 20
పీడీ : 56
పీఈటీ : 09
ఇతరులు : 92

ఉపాధ్యాయుల సర్దుబాటు