
కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
మహబూబాబాద్: రాష్ట్రంలో కోటి మంది మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క సీఎస్ రామకృష్ణారావుతో కలిసి బడి బాట, ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాలపై కలెక్టర్లలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జిల్లాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలన్నారు. పెట్రోల్ బంక్ వల్ల పది కుటుంబాలు బాగుపడుతాయన్నారు. మహిళా సంఘాల ద్వారా రైస్ మిల్స్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, ఆర్టీసీ బస్సులు నడపడం వంటి అనేక కార్యక్రమాల అమలుకు చర్యలు చేపట్టామన్నారు. నవంబర్ నాటికి జిల్లాలో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు యూనిఫాం కుట్టు పనులు వేగవంతం చేసి ఈనెల 12న పండుగ వాతావరణంలో పంపిణీ చేయాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వీసీలో మంత్రి ధనసరి సీతక్క