
పీడీఎస్యూ రౌండ్టేబుల్ సమావేశం అడ్డగింత
● కేయూ గేట్వద్ద పీడీఎస్యూ, ప్రజాసంఘాల నిరసన
కేయూ క్యాంపస్: మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ను నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) ఆధ్వర్యంలో శుక్రవారం కేయూ ఫార్మసీ కళాశాల భవనంలో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటుచేసుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమావేశానికి వివిధ ప్రజాసంఘాల రాష్ట్ర , జిల్లా నాయకులు కూడా వచ్చారు. సమావేశం నిర్వహించుకునేందుకు ఉపక్రమించబోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సీఐ రవికుమార్ సిబ్బందితో వచ్చి పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్ను పిలిచి రౌండ్టేబుల్ సమావేశానికి అనుమతిలేదని పేర్కొన్నారు. దీనికి మహేశ్ స్పందిస్తూ తమకు రిజిస్ట్రార్ అనుమతి ఇచ్చారని తెలిపారు. అయినా పోలీసులు నిర్వహించొద్దని తేల్చిచెప్పడంతో ఇక చేసేది ఏమిలేక ప్రజాసంఘాల బాధ్యులు బయటకు వచ్చారు. రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించలేదు.
కేయూ గేట్వద్ద నిరసన..
యూనివర్సిటీలోని ప్రిన్సిపాల్ ఆఫీస్ ఎదుట నుంచి మొదటి గేట్ వరకు పీడీఎస్యూ, ప్రజాసంఘాల బాధ్యులు ర్యాలీ నిర్వహించారు. అక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మధ్యభారతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రౌండ్టేబుల్ సమావేశం అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాణి, నాయకులు జయంత్, టీపీఎఫ్ రాష్ట్ర నేత బి. రమాదేవి, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, న్యూడెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజయ్, మాజీ ఉపాధ్యక్షుడు బండి కోటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.