గాలీవాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలీవాన బీభత్సం

May 30 2026 3:02 AM | Updated on May 30 2026 3:02 AM

విరిగిన విద్యుత్‌ స్తంభాలు,

నేలకొరిగిన భారీ వృక్షాలు

జొహరాపురంలో కూలిన రేకులషెడ్డు

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభం పెద్దకొత్తిలిలో ఇంటిపై పడిన చెట్టు

నందవరం: దాదాపు 45 నిమిషాలు భారీ ఈదురు గాలులు, వర్షం తొమ్మిది గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. మండల కేంద్రం నందవరంతో పాటు నాగలదిన్నె, చిన్నకొత్తిలి, పెద్దకొత్తిలి, జొహరాపురం, గంగవరం, నదికై రవాడి, ఇబ్రహీంపురం, మాచాపురం తదిరత గ్రామా ల్లో శుక్రవారం ఉదయం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం 6.15 నుంచి 7 గంటల మధ్య కురిసి న గాలీవానకు భారీ చెట్లు నెలకొరిగాయి, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. నదికై రవాడి గ్రామంలో ఇళ్లపై భారీ వృక్షాలు పడ్డాయి. రేకుల షెడ్డులు ఎగిరిపోయాయి. జొహరాపురం గ్రామంలో మహిళ రైతు సుశీలమ్మ రేకుల షెడ్డు ఎగిరిపోవడంతో ధాన్యం, ఎరువు లు వానకు తడిచిపోయాయి. గ్రామంలో దాదాపు 15 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మంత్రాలయం – నాగలదిన్నె ప్రధాన రహదారిలో నదికై రవాడి, జొహరాపురం, పెద్దకొత్తిలి, చిన్నకొత్తిలి గ్రామాల్లో రోడ్లపై భారీ వృక్షాలు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 40కిపైగా విద్యుత్‌ స్తంభాలు, ఐదు ట్రాన్స్‌ఫార్మర్లు విరిగిపడ్డాయి. జొహరాపురం గ్రామంలోని మండల పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న భారీ బసిరి చెట్టు గాలీవానకు నేలకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన రైతు బోయ కిష్టప్ప(45)పై పొలం వద్ద చెట్టు కూలి పడటంతో మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్‌ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబీకులను పరామర్శించారు.

ఉప్పొంగిన వంకలు.. నిలిచిన రాకపోకలు

భారీ వర్షంతో మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దకొత్తిలి గ్రామంలో వంక ఉద్ధృతంగా ప్రవహించడంతో మంత్రాలయం, ఎమ్మిగనూరు మీదుగా వెళ్లే వాహనాలకు 8 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ గాలీవానలకు చెట్లు కూడా ప్రధాన రహదారుల్లో నేలకొరిగాయి. మండలంలోని ఇబ్రంహీంపురం, మాచాపురం, పెద్దకొత్తిలి వంకలు ఉధృతంగా ప్రవహించాయి.

Advertisement
 
Advertisement
Advertisement