కర్నూలు(అగ్రికల్చర్): టమాట కొరత ఏర్పడటంతో ధర రోజురోజుకు పెరిగిపోతోంది. టమాట సాగుకు పెట్టింది పేరైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఆస్పరి, దేవనకొండ, పెద్దకడుబూరు, హాలహర్వి, హొళగుంద, పత్తికొండ, మద్దికెర, డోన్, ప్యాపిలి, ఓర్వకల్, క్రిష్ణగిరి, కోడుమూరు, బేతంచెర్ల మండలాల్లో టమాట ఎక్కువగా సాగవుతోంది. మామూలుగా అయితే వేసవిలో టమాట కొరత ఏర్పడకుండా రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇచ్చి నీటి వసతి కింద సాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ బాధ్యతను విస్మరించింది. ఫలితంగా నేడు ఒక్క ఎకరాలో కూడా టమాట కనిపించని పరిస్థితి ఏర్పడింది. మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పండించిన టమాట జిల్లాలోకి దిగుమతి అవుతోంది. బుధవారం కర్నూలులోని రైతుబజార్లలో కిలో ధర రూ.40 పలికింది. బయట రూ.50 నుంచి రూ.60 ధరతో అమ్మకాలు సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


