కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని మార్చురీకి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తూ మంగళవారం కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9న ‘మార్చురీలో రాబందులు’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఆమె స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చురీలో ప్రభుత్వ సిబ్బంది లేకపోవడంతో అనధికార వ్యక్తులు వచ్చి పోస్టుమార్టం విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీరి స్థానంలో కళాశాలలో పనిచేసే ఇద్దరు శానిటేషన్ వర్కర్లు, నలుగురు సెక్యూరిటీ గార్డులు, నలుగురు తోటీలు, ఒక ఆఫీస్ సబార్డినేట్ను కేటాయించారు.


