● ఆలూరు ఎమ్మెల్యే
బుసినె విరూపాక్షి
చిప్పగిరి: చంద్రబాబు పాలనలో విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి తదితర రంగాలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతాంగానికి చేసింది ఏమీ లేదన్నారు. జగనన్న హయాంలో ఖరీఫ్, రబీ సీజన్ ముగిసేలోపు పంటల బీమా సాయం అందించారని గుర్తు చేశారు. చంద్ర బాబు పాలనలో మోంథా తుపాన్తో దెబ్బతిన్న పంటలకు నేటి వరకు నష్ట పరిహారం అందలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి రైతుకు రైతుభరోసా సాయం అందిస్తే చంద్రబాబు రెండేళ్ల పాలనలో కేవలం ఒక్కసారి తూతూ మంత్రంగా అన్నదాత సుఖీభవ అందించారన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో అనేక మంది విద్యార్థులు బాధపడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా లక్షల కోట్లు అప్పులు తెస్తూ అప్పుల ఆంధ్రగా మారుస్తున్నారని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా పాలన చేస్తే ప్రస్తుత చంద్రబాబు పాలన దోచుకో, దాచుకో అన్న చందంగా పాలన చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ నాయకులు బుసినె చంద్రశేఖర్, శ్రీరాములు, వెంకటేష్, మహానంది, హనుమంతు ఉన్నారు.


