కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచనల మేరకు స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనున్న హోప్ ఆఫ్ హోమ్లో పొక్సో యాక్ట్పై గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పొక్సో చట్టం గురించి వివరించారు. 18 సంవత్సరాల్లోపు వయస్సు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా పొక్సో యాక్ట్ ఉపయోగపడుతుందన్నారు. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఉందన్నారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేస్తే పరిష్కరిస్తామన్నారు. ఐసీడీఎస్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, జాగృతి యూనిట్ సభ్యుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.


