● రేపటి నుంచి ఖాదర్లింగస్వామి ఉరుసు
కౌతాళం: ఖాదర్లింగ స్వామి.. హిందు, ముస్లింల ఆరాధ్య దైవం. ప్రతి సంవత్సరం కౌతాళంలో ఉరుసును వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు మంగళవారం ప్రారంభమై మే 2వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగనున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ పట్టణానికి చెందిన ఖాదర్లింగ స్వామి అమీనూద్దీన్ అలిఆలా షేర్ ఏ ఖుదా గురువు ఆజ్ఞానుసారం మానవుల్లో మత మౌఢ్యాన్ని తొలగించేందుకు కౌతాళానికి వచ్చారు. ఈయన లింగాన్ని ధరించడాన్ని గ్రామంలో ఉన్న కొందరు అభ్యంతరం చెప్పగా వారిలో ఇళ్ల నుంచి బావిలోకి వెళ్లిన లింగాలను తిరిగి రప్పించారు. అప్పటి నుంచి గ్రామస్తులంతా మత సామరస్యంతో ఆయనను ఖాదర్లింగ స్వామిగా పూజిసున్తన్నారు. ఆయన గ్రామస్తులు ఇచ్చిన స్థలంలోనే సమాధి అయ్యారు. అక్కడే ఖాదర్లింగస్వామి దర్గా నిర్మించారు. భక్తుల సహకారంతో దర్గా ఆవరణలో 2023లో మసీద్ నిర్మాణం పూర్తి చేశారు. దర్గా గోపురం 60 అడుగులతో ఎంతో సుందరంగా ఉంది. దీని లోపలి భాగంలో నూతనంగా గ్లాస్ ఫిట్టింగ్తో వివిధ రంగులతో ప్రత్యేక హాదిసు ఆయాత్లు (ఉర్దూలో) గ్లాసుల్లో అమర్చారు.
ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాం. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సహకారించాలి.
– సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ, దర్గా ధర్మకర్త


