కర్నూలు(అర్బన్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై ఈ నెల 27వ తేదీన (నేడు) కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పీఎన్ అస్లాం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవినీతి మయంగా మార్చిందన్నారు. ఉపాధి నిధులను టీడీపీ నేతలు, కార్యకర్తలకు దోచిపెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధిలోని అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
మహిళల స్వయం సమృద్ధికి కృషి
కర్నూలు(టౌన్): మహిళల స్వయం సమృద్ధి, సాధికారతకు కేడీఎస్ఎస్ఎస్ కృషి చేస్తోందని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ అన్నారు. ఆదివారం కర్నూలు శివారులోని కర్నూలు డయాసిస్ సాంఘిక సేవాసంస్థ (కేడీఎస్ఎస్ఎస్) ఆధ్వర్యంలో 70 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేడీఎస్ఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ తోట జోసఫ్ మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా మహిళాభ్యుదయం కోసం భాగస్వాములవుతున్నామన్నారు. త్వరలోనే నూతన రంగాల్లో సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కెడీఎస్ఎస్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
క్వింటా వేరుశనగ రూ.6,970
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు ఆదివారం వేరుశనగ దిగుబడులు 474 క్వింటాళ్లు విక్రయానికి వచ్చాయి. క్వింటా వేరుశనగకు గరిష్టంగా రూ.6,970 ధర పలికిందని మా ర్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్ర మౌళి తెలిపారు. క్వింటా కనిష్ట ధర రూ.4,170, మధ్యస్థ ధర రూ.6,147 వచ్చిందన్నారు. మొక్కజొన్న 17 క్వింటాళ్లు విక్రయానికి రాగా క్వింటాకు రూ.1,120 ధర లభించిందన్నారు.


