ఉమ్మడి జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రజలు తమ వాహనాలను బయటకు తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంకులు మూతపడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. డీజిల్ సరఫరాలో జాప్యంతో రవాణా రంగం స్తంభించిపోతోంది. ఆదివారం కూడా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. ఆటో వాలాలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారి ఉపాధిపై దెబ్బపడుతోంది. మరో వైపు వ్యవసాయ పనులు స్తంభించిపోతున్నాయి. పంట నూర్పిళ్ల యంత్రాలు, ట్రాక్టర్లకు డీజిల్ అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, నెట్వర్క్
గత నాలుగైదు రోజుల ఉంచి కోడుమూరుతో పాటు చుట్టూ పక్కల ఎక్కడా కూడా పెట్రోల్ లభించడం లేదు. స్టాక్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతోంది. పెట్రోల్ కావాలంటే బంకుల వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. చివరకు పెట్రోల్ దొరకక బండిని తీయడం లేదు. ప్రభుత్వం స్పందించి పెట్రోల్, డీజిల్ను అన్ని బంకుల్లో అందుబాటులో ఉంచాలి. – వీరేష్రెడ్డి, వ్యాపారి, కోడుమూరు


