కర్నూలు: మాజీ సైనికులందరూ ఉచిత న్యాయ సహాయానికి అర్హులని, చట్టబద్ధమైన సమస్యలు ఉంటే వాటికి ఉచితంగా న్యాయాన్ని అందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు శనివారం కర్నూలు బి.క్యాంప్లో ఉన్న జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ను లీలా వెంకటశేషాద్రి సందర్శించారు. మాజీ సైనికుల సమస్యలను చర్చించారు. సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ న్యాయవాదితో పాటు పారా లీగల్ వాలంటీర్లు ఉంటారని తెలిపారు. లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ హెల్ప్లైన్ నెంబర్ 15100కు ఫోన్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జిల్లా ఇన్చార్జి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మహేంద్రమ్మ, పారా లీగల్ వలంటీర్ మధుసూదన్, మాజీ సైనికుల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


